Ad Code

సామాన్య వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న 'టెక్ హ్యాక్స్' !


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని 'టెక్ హ్యాక్స్'  సామాన్య వినియోగదారులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. వైఫై రూటర్ మీద నాణేలు ఉంచితే ఇంటర్నెట్ వేగం పెరుగుతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ 'టెక్ హ్యాక్' నిజమని నమ్మి తమ రూటర్ల మీద నాణేల రాశులు పోస్తున్నారు. అయితే, టెక్ నిపుణులు దీనిపై ఒక షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. రూటర్ మీద లోహపు నాణేలను ఉంచడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ పెరగకపోగా, ఉన్న సిగ్నల్ కూడా బలహీనపడి ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇది రూటర్ అతిగా వేడెక్కేలా చేసి అగ్ని ప్రమాదాలకు కూడా దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైఫై రూటర్లపై నాణేలను ఉంచితే సిగ్నల్ పెరుగుతుందని, రూటర్ నుండి వచ్చే వేడిని అవి పీల్చుకుంటాయని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఈ చిన్న తప్పు ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించడమే కాకుండా, ఇంటిని కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. వైఫై రూటర్లు రేడియో తరంగాల ద్వారా పనిచేస్తాయి. రూటర్ మీద లోహపు నాణేలను ఉంచడం వల్ల యాంటెన్నా నుండి వచ్చే సిగ్నల్స్ మెరుగుపడవు, పైగా ఉన్న సిగ్నల్ కూడా అస్థిరతకు గురవుతుంది. లోహం సిగ్నల్‌లను అడ్డుకుంటుంది లేదా దిశ మారుస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ వేగం పెరగడానికి బదులుగా, కనెక్షన్ కట్ అవ్వడం లేదా రేంజ్ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాంకేతికంగా ఇది ఎలాంటి అదనపు ప్రయోజనాన్ని ఇవ్వదు, పైగా రూటర్ పనితీరును దెబ్బతీస్తుంది. నాణేలు వేడిని పీల్చుకుంటాయి అని భావించడం కూడా పెద్ద తప్పు. రూటర్ నుండి వచ్చే వేడిని నాణేలు బయటకు పంపవు. బదులుగా రూటర్ వెలుపలి వేడి ఒకే చోట పేరుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల లోపల ఉండే సర్క్యూట్ బోర్డ్ ఓవర్ హీట్ అయి, కాలక్రమేణా రూటర్ పాడైపోయే అవకాశం ఉంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఇలా ఉష్ణోగ్రత పెరగడం వల్ల కొన్ని సందర్భాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu