Ad Code

అమెరికా సైనికులకు ఆహార రేషనింగ్ !


మెరికా సైనికులు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చాలిచాలని పలుచని చపాతీలు, ఉడికించిన కొన్ని క్యారెట్ ముక్కలు, కొంచెం మాంసంతో కడుపునింపుకుంటున్నారు. ఇరాన్ తో యుద్ధం కారణంగా వేలాది మంది అమెరికా సైనికులు పశ్చిమాసియాకు వెళ్లారు. వారిలో నౌకదళం కూడా ఉంది. వీరంతా హార్మూజ్ జలసంధి దిగ్భంధనంలో విధులు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం వారికి ఆహారం అందడం లేదని తెలుస్తోంది. వారికి వడ్డిస్తోన్న ఆహారం ఫోటోలను సైనికులు తమ కుటుంబ సభ్యులకు షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని మీడియా కథనాలు చెప్తున్నాయి. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ తో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య అమెరికా నౌకాదళం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్, ట్రిపోలీ నౌకల్లోని సైనికులకు సరైన భోజనం అందడం లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ తాజా ఆహార పదార్థాలు పూర్తిగా అయిపోయాయి. సైనికులు తమకు దొరికిన కొద్దిపాటి ఆహారాన్ని అందరూ సమానంగా పంచుకుని తింటున్నారు. వాయుమార్గం మూసివేత వల్ల నౌకలకు సరుకుల సరఫరా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల నౌకల్లో రేషనింగ్ పద్ధతిని అమలు చేస్తూ ఆహారాన్ని పొదుపుగా వాడుతున్నారు. అమెరికా తపాలా శాఖ కూడా యుద్ధం కారణంగా మెయిల్ సర్వీసులను నిలిపివేసింది. దాదాపు ఇరవై ఏడు మిలిటరీ జిప్ కోడ్లకు పార్సెళ్ల సరఫరాను రద్దు చేశారు. దీనివల్ల కుటుంబ సభ్యులు పంపే తినుబండారాలు, ఇతర వస్తువులు అందడం లేదు. వేల సంఖ్యలో కేర్ ప్యాకేజీలు ప్రస్తుతం వివిధ గిడ్డంగుల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. తాజా పండ్లు, కూరగాయలు లేకపోవడంతో సైనికుల ఆరోగ్యం దెబ్బతింటోంది. తక్కువ నాణ్యత కలిగిన ప్రాసెస్ చేసిన మాంసాన్ని మాత్రమే ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. దీనివల్ల సైనికుల్లో మానసిక ధైర్యం, పని సామర్థ్యం తగ్గుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఒక మెరైనర్ తన తండ్రికి చేసిన మెసేజ్ లో  తాజా సరకులు అనేవే లేవని వెల్లడించారు. తన బిడ్డ కోసం షాంపూ, టూత్ పేస్ట్, కొన్ని స్నాక్స్ పంపానని తండ్రి చెప్పారు. కానీ, అవి ఇంతవరకు చేరలేదని వాపోయాడు. ‘‘వీలైనప్పుడు తింటున్నాం. ఎవరికైనా ఎక్కువ ఆహారం అందితే దాన్ని ఇతరులతో పంచుకుంటున్నాం. సరకులు చాలా తక్కువగా ఉన్నాయి’’ అని ఒక సెయిలర్ తన తల్లితో ఫోన్లో వాపోయారు. ఆ సైనికునికి వారి కుటుంబం ఆహారాన్ని పంపినా అది అతనికి చేరలేదు. యుద్ధం వల్ల గగనతల మూసివేతలు, రవాణా సమస్యల కారణంగా ఏప్రిల్ నుంచి డెలివరీలు నిలిచిపోయినట్లు యూఎస్ ఆర్మీ ప్రతినిధి మీడియాకు వెల్లడించడం గమనార్హం. ట్రిపోలి నౌక మార్చి 27న 3,500 మంది మెరైన్లతో ఇరాన్ కు సమీపంలోకి వెళ్లింది. ఇక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ జనవరి 26నే పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకుంది.ఈ రెండు నౌకల్లోనూ నాణ్యమైన ఆహారం లభించడం లేదని మీడియా కథనాలు వెల్లడించాయి.

Post a Comment

0 Comments

Close Menu