ఆంధ్రప్రదేశ్ లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తదితర దిగ్గజ పారిశ్రామిక సంస్థలు సహా పలు కంపెనీలు రాష్ట్రంలో మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న తొమ్మిది ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుల గురించి సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం నిర్వహించారు. వాటిపై చర్చించి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపులతో పాటు అవసరమైన మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని, అదే సమయంలో ఒప్పందం ప్రకారం నిర్దిష్ట సమయంలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. తాజా ప్రాజెక్టులు, వాటి పెట్టుబడులు, తద్వారా లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. గత నెల 19న జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి కూడా చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
0 Comments