ఇరాన్పై యూఎస్ వైమానిక దాడులకు అత్యంత కీలకమైన విమానాన్ని ఇరాన్ నాశనం చేసింది. శుక్రవారం సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై తాము జరిపిన క్షిపణి, డ్రోన్ దాడిలో అమెరికాకు చెందిన విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా సైనిక ఆస్తులతో పాటు E-3 AWACS (ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) కమాండ్ అండ్ కంట్రోల్ విమానం నాశనమైంది. దీంతో పాటు అనేక ఏరియల్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు కూడా దెబ్బతిన్నాయి. ఇరాన్ ప్రెస్ విడుదల చేసిన ఫోటోల్లో విమానం మధ్య భాగం నుజ్జునుజ్జు అయినట్లు కనిపిస్తోంది. ఈ దాడికి ఆరు బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లు ఉపయోగించినట్లు సమాచారం. ఈ దాడిలో కనీసం 10 మంది అమెరికన్ సైనికులు గాయపడగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిపై యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పటికే అమెరికాకు చెందిన ఒక MQ-9 డ్రోన్ను కూల్చివేసి, ఒక F-16 జెట్ను కూల్చినట్లు ఇరాన్ పేర్కొంది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం, దాడికి ముందు ఆ స్థావరంలో సుమారు ఆరు E-3 సెంటినల్ విమానాలను అమెరికా మోహరించింది. ఇది వైమానిక ముప్పును గుర్తించడానికి ఉపయోగించే నిఘా విమానం. ధ్వంసమైన విమానం విలువ సుమారుగా $700 మిలియన్లు (రూ. 6600 కోట్లు) ఉంటుందని అంచనా. E-3 సెంటినల్ విమానాన్ని అమెరికా వైమానిక కార్యకలాపాలకు వెన్నెముకగా పరిగణిస్తారు. ఇది గాలిలో ఉంటూనే శత్రుదేశాల వైమానిక ముప్పును ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. అమెరికా వైమానిక దళానికి నిఘా, పర్యవేక్షణ, గూఢచర్యం వంటి కీలక సామర్థ్యాలను అందిస్తుంది. 1970ల నుండి సేవలో ఉన్న ఈ విమానం, ఆపరేషన్ డెసర్ట్ స్టార్మ్, కొసావో యుద్ధం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్లతో సహా ఆపరేషన్ ఇన్హెరెంట్ రిసాల్వ్ వంటి అనేక ప్రధాన సైనిక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించింది. గాలిలోనే ఉంటూ గగనతలంలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. వివిధ యుద్ధ విమానాలను సమన్వయం చేస్తుంది. అమెరికాతో పాటు ఫ్రాన్స్, యూకే, సౌదీ అరేబియా వంటి అనేక ఇతర దేశాల సైన్యాలు కూడా దీనిని ఉపయోగిస్తున్నాయి. ఈ విమానం ధ్వంసమవ్వడం అమెరికాకు గట్టి దెబ్బగా నిపుణులు భావిస్తున్నారు.
0 Comments