బెంగళూరులోని జయనగర్ లో ఉన్న కేఎస్ఐసీ మైసూర్ సిల్క్ షోరూమ్ ముందు ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సోనా సెబిన్ అనే యువతి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన వీడియో ప్రకారం మైసూర్ సిల్క్ చీర కొనడానికి ఆమె వేకువజామున 4 గంటలకే షోరూమ్ వద్దకు చేరుకుంది. ఆమె వెళ్లేసరికి అప్పటికే చాలా మంది మహిళలు లైన్లో ఉన్నారు. ఒక మహిళ తానేమో తెల్లవారుజామున 3 గంటలకే వచ్చానని చెబితే, మరో వ్యక్తి ఏకంగా ముందు రోజు రాత్రి 9 గంటల నుంచే క్యూలో నిలబడినట్లు చెప్పడం విశేషం. ఈ షోరూమ్ ఉదయం 10:30 గంటలకు మాత్రమే తెరుస్తారు. లోపలికి ఒకేసారి కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తారు. అంతేకాదు, ఒక్కో కస్టమర్ కేవలం 10 నిమిషాల్లోనే చీరను ఎంపిక చేసుకోవాలి. ఒక టోకెన్ మీద ఒకే చీర ఇస్తారు. మైసూర్ సిల్క్ చీరల ధరలు ₹23,000 నుంచి ప్రారంభమై ₹2.5 లక్షల వరకు ఉంటాయి. ధర ఇంత ఎక్కువగా ఉన్నా, ఆ చీరల నాణ్యత మరియు వాటికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా మహిళలు గంటల తరబడి నిరీక్షించేందుకు సిద్ధపడుతున్నారు. కాఫీ తాగడానికి బయటకు వెళ్లి వచ్చేలోపు క్యూ లిస్టులో మరో 50 పేర్లు చేరడం చూసి ఆ యువతి ఆశ్చర్యపోయింది. యువతి మైసూర్ సిల్క్ చీర కోసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
0 Comments