కర్ణాటకలోని బెళగావిలోని షాహు నగర్కు చెందిన అంజనా ధమోనే అనే వృద్ధురాలు ఏప్రిల్ 15న కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎంతో కష్టపడి వారిని పెంచి పెద్ద చేసిన ఆ తల్లి, చివరి రోజుల్లో మాత్రం ఒంటరిగానే గడిపింది. ఆమె మరణించినప్పుడు స్థానికులు వెంటనే ఆమె కుమారులకు సమాచారం అందించారు. తల్లి చనిపోయిందన్న వార్త విని కొడుకులు కనీసం బాధపడకపోగా "మీరే ముందుకు వెళ్లి ఆ అంత్యక్రియలు కానిచ్చేయండి" అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. వారి ప్రవర్తన చూసి స్థానికులు విస్తుపోయారు. కొడుకుల కఠిన హృదయాన్ని చూసి చలించిపోయిన కొందరు స్థానిక సామాజిక కార్యకర్తలు చివరకు ముందుకు వచ్చి, ఆ వృద్ధురాలి అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కన్నవారిని కడసారి చూసుకోవడానికి కూడా ఇష్టపడని ఇటువంటి కొడుకులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
0 Comments