తమిళనాడు డీజీపీ కార్యాలయానికి శనివారం ఒక అజ్ఞాత ఈ-మెయిల్ అందింది, అందులో పోయెస్ గార్డెన్లోని రజనీకాంత్ నివాసం, అల్వార్పేటలోని ధనుష్ నివాసాల్లో బాంబులు అమర్చినట్లు, అవి కొద్దిసేపట్లోనే పేలుతాయని పేర్కొన్నారు. ఈ సమాచారం అందిన వెంటనే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై, బెదిరింపు తీవ్రత దృష్ట్యా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు హీరోల నివాసాల వద్దకు భారీగా చేరుకున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో కలిసి పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటి లోపల, గార్డెన్ ఏరియా, ఇంటి పరిసర ప్రాంతాలను సుమారు గంటన్నర పాటు అణువణువూ గాలించారు. సుదీర్ఘ తనిఖీల తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అది కేవలం ఒక ‘ఫేక్ మెయిల్’ అని పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. భయాందోళనలు సృష్టించేందుకే ఎవరో ఆకతాయిలు ఈ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా పలుమార్లు రజనీకాంత్ నివాసానికి ఇలాంటి నకిలీ బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది? ఐపీ అడ్రస్ ఎవరిది? అనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది.
0 Comments