కోల్కతాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఈసారి బీజేపీ పాగా వేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో సాగుతున్న సిండికేట్, మాఫియా, గూండా రాజ్యానికి త్వరలోనే ముగింపు పలుకుతామని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానన్న సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను అమిత్ షా కొట్టిపారేశారు. ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ చిరునవ్వుతో స్పందించారు. "రాష్ట్రంలోనే అధికారాన్ని కోల్పోతున్న దీదీ, ఇక ఢిల్లీకి ఎలా వెళ్తారు? ఈ ఎన్నికల తర్వాత ఆమెకు బెంగాల్లోనే ఏమీ మిగలదు" అని ఎద్దేవా చేశారు. అంతకుముందు గురువారం పోలింగ్ సమయంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. బెంగాల్లో గెలిచిన వెంటనే తన దృష్టిని కేంద్ర రాజకీయాల వైపు మళ్లిస్తానని, బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తానని ప్రకటించారు. గెలుపు కోసం బీజేపీ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటూ అన్ని హద్దులు దాటుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీలో ఉంటూ బీజేపీ కోసం పని చేసిన ద్రోహులందరినీ గుర్తుంచుకుంటానని, వారికి తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు.
0 Comments