Ad Code

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు !


తిరుమలలో వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, బారీకేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతి, తిరుమలలో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారు. తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా 13 నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేశారు. అయితే ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. అదేవిధంగా చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతించనున్నట్టుగా ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసింది. ఇక, శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తులు వారి ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని.. టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్‌లను కూడా జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని మరోసారి టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.


Post a Comment

0 Comments

Close Menu