Ad Code

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ వెసులుబాటు కల్పించిన ఆంధ్రప్రదేశ్


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం 'ఇంద్రధనస్సు' పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని నేటి అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం 'ఇంద్రధనస్సు' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ వెసులుబాటు కలుగుతుంది. ఫిబ్రవరి 24న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోగా, నేటి నుంచి ఇది అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారు ఎటువంటి టికెట్ ఛార్జీ చెల్లించకుండా ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో లబ్ధిదారులు ప్రభుత్వం జారీ చేసిన సదరం సర్టిఫికెట్ లేదా స్మార్ట్ కార్డ్ ను కండక్టర్‌కు చూపించి 'జీరో టికెట్' పొందవచ్చు. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో సిటీ బస్సుల్లో మాత్రమే ఉన్న ఈ ఉచిత సౌకర్యం, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు రకాల బస్సు సర్వీసులకు విస్తరించబడింది. దివ్యాంగులు మొత్తం ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. అయితే, లగ్జరీ మరియు సుదూర ప్రాంతాలకు వెళ్లే నాన్‌స్టాప్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్‌రాష్ట్ర (ఇంటర్‌స్టేట్) బస్సుల్లో మాత్రం గతంలో ఉన్నట్లే 50 శాతం రాయితీ కొనసాగుతుంది.

Post a Comment

0 Comments

Close Menu