హర్యానాలోని పానిపట్ లో బీమా సఖి యోజన పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. వచ్చే మూడు సంవత్సరాల రెండు లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం ద్వారా కృషి చేయనున్నట్టు వెల్లడించారు. బీమా సఖి యోజన పథకం ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహిళలకు శిక్షణ, ఉపాధిని కల్పించనుంది. దీని ద్వారా మహిళలు బీమా గురించి తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఎల్ఐసి బీమా పాలసీలను ఏ విధంగా అమ్మాలో నేర్చుకుంటారు. వీరికి శిక్షణ ఇచ్చిన తర్వాత బీమా సఖి యోజన పథకం ద్వారా వీరికి ఉపాధిని కల్పిస్తారు. దీని ద్వారా వీరు ఆర్థికంగా ఎదగడానికి దోహదం చేస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ పథకంగా బీమా సఖి యోజనను తీసుకువచ్చారు. గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం. అంతేకాదు వీరికి ప్రతినెలా స్థిరమైన ఆదాయం ఉండేలా చూడడం కూడా ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా గ్రామాలలోని పేద మహిళలను గుర్తించి వారందరికీ ఈ పథకం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించి ఆర్థిక భరోసాని ఇవ్వడం కోసం కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే మహిళల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. వీరంతా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పథకంలో శిక్షణ పొందే మహిళలకు మొదటి మూడు సంవత్సరాలు స్టైఫండ్ ఇస్తారు. ఆ తర్వాత వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఈ పథకం ద్వారా మొదటి సంవత్సరం మహిళలు ప్రతి నెలా ఏడు వేల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతారు. రెండవ సంవత్సరం 6000 రూపాయలు, మూడవ సంవత్సర 5000 రూపాయలు నెలవారి ఆదాయం లభిస్తుంది. అంతేకాదు వీరికి ప్రోత్సాహకంగా 2000 రూపాయలు కూడా లభిస్తాయి .ఆ తర్వాత వీరు బీమా ఏజెంట్లుగా మారే అవకాశం వస్తుంది.
0 Comments