భారత్ వస్తున్న థాయ్లాండ్ ఆయిల్ ట్యాంకర్పై దాడి జరిగింది. ఒమన్ తీర సమీపంలో థాయ్ నౌక మయూరీ నారీ బ్యాంకాక్ను ఇరాన్ క్షిపణులు ఢీకొన్నాయి. ఈ ఘటనతో థాయ్లాండ్ నౌకదళం, అంతర్జాతీయ తీరప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణమే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షిపణి దాడితో నౌక మంటల్లో చిక్కుకుని సగం కాలిపోయింది. 20 మంది సిబ్బందిని కాపాడమని, మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. హర్మూజ్ జల సంధిలో థాయ్లాండ్ నౌకపై తామే క్షిపణితో దాడిచేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజాగా ప్రకటించింది. మయూరీ నారీ బ్యాంకాక్ ట్యాంకర్ గుజరాత్లోని కాండ్లా పోర్టుకు వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. మరో రెండు నౌకలు కూడా భద్రతా కారణాలతో హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయాయి. ఇజ్రాయెల్-అమెరికా దాడులతో హర్మూజ్ జల సంధిను మూసివేసిన ఇరాన్.. ఆయిల్ సరఫరాను అడ్డుకుంటోంది. దీంతో చమురు, గ్యాస్ రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడి.. అంతర్జాతీయ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో థాయ్లాండ్ కార్గో నౌకపై దాడి మరింత భయాందోళనకు గురిచేస్తోంది. థాయ్ కంపెనీ ప్రీసియస్ షిప్పింగ్కు చెందిన మయూరీ నారీ బ్యాంకక్ నౌక.. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్లో ఖలీఫా ఓడ రేవులో క్రూడాయిల్ నింపుకుని.. గుజరాత్లో కాండ్లా రేవుకు హర్మూజ్ జల సంధి గుండా బుధవారం బయలుదేరింది. అక్కడ నుంచి ప్రయాణం మొదలైన కాసేపటికే ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో నౌక ధ్వంసమైన ఫోటోలను రాయల్ థాయ్లాండ్ నేవీ షేర్ చేసింది. మొత్తం 170 మీటర్ల పొడవు ఉండే ఈ నౌక బరువు 30 వేల టన్నులు. గల్ఫ్ తీరంలో మూడు కార్గో నౌకలపై మంగళవారం దాడి జరిగినట్టు యునైటెడ్ కింగ్డమ్ మారీటైమ్ ట్రేడ్ కార్పొరేషన్ సెంటర్ తెలిపింది. అందులో ఒకటి మయూరీ నారీ ఒకటా? కాదా? అనేది స్పష్టత లేదు. ఇజ్రాయెల్- అమెరికా సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఇరాన్ సైతం ప్రతీకార చర్యలకు దిగి.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని మూసివేసింది. అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్, వాటి భాగస్వామ్య దేశాల నౌకలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఒకవేళ తమ హెచ్చరికలను ధిక్కరించి, దాటే ప్రయత్నం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇదే సమయంలో సీమైన్స్ కూడా ఇరాన్ మోహరించడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
0 Comments