ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో హైడ్రామా చేస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ తీవ్రంగా విమర్శించారు. మండల కేంద్రమైన క్రిష్ణగిరిలో నేడు విలేకరులతో మాట్లాడిన ఆమె, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ వైఫల్యాలను దాచిపెట్టేందుకు అమరావతి రాజధాని అంశాన్ని ముందుకు తెచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కనిపించడం లేదని, అవినీతి జరుగుతుందని ప్రశ్నిస్తే బురదజల్లడం సీఎం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. అమరావతి రాజధానికి ఎవరు అడ్డుపడుతున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో, ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పక్కదారి పట్టించే కుట్రలో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా నిర్వహించారని విమర్శించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన ప్లాట్లు కూడా సరైన స్థితిలో లేవని, కొన్ని చెరువుల్లో ఉన్నాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. అమరావతిని టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, మూడు పంటలు పండే లక్షల ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించి తమ అనుచరులకు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
0 Comments