తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన "స్టాండ్ విత్ హర్" కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సీఎంతో పాటు నటుడు సాయి తేజ్, మంత్రులు, డీజీపీ శివధర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మహిళలకు అత్యున్నత పదవులు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని, దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్సభ స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా మహిళలు సేవలందించే అవకాశం కాంగ్రెస్ కల్పించిందన్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలంగాణలో కూడా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. మహిళను మనం శక్తికి ప్రతీకగా భావిస్తామని, కానీ అలాంటి మహిళలకు సరైన రక్షణ కల్పించలేకపోతే అది సమాజానికి గౌరవం కాదన్నారు. మహిళల భద్రత, గౌరవం కోసం ప్రభుత్వం మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇంతకు ముందు మహిళలపై వేధింపులు కొన్ని పరిమిత ప్రాంతాల్లోనే ఉండేవని, కానీ ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందడంతో సోషల్ మీడియా ద్వారా కూడా మహిళలు వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, అందుకే డిజిటల్ ప్రపంచంలో కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం చట్టాలు చేయడం, పోలీసులు పర్యవేక్షించడం మాత్రమే సరిపోదని, సమాజం మొత్తం దీనిని సామాజిక బాధ్యతగా తీసుకుంటేనే మహిళలపై జరిగే అన్యాయాలను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు ఎలా గౌరవం ఇస్తామో, సమాజంలోని ప్రతి మహిళను కూడా అలాగే గౌరవించాలని కోరారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలను మహిళల పేరుతోనే అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల మహిళలు కుటుంబంలో ఆర్థికంగా బలపడతారని ఆయన చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తూ మహిళలు స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. శిల్పారామం వద్ద దుకాణ సముదాయాలను కేటాయించడం ద్వారా మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావడానికి అవకాశాలు కల్పించామని తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా మహిళలకు అవకాశాలు కల్పిస్తూ వారు పెద్ద వ్యాపార సంస్థలతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం అన్నారు. అలాగే మహిళలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదగడానికి మార్గాలు కల్పిస్తున్నామని చెప్పారు. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేసి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి అయిలమ్మ పేరు పెట్టడం ద్వారా మహిళా శక్తికి గౌరవం చాటామని సీఎం పేర్కొన్నారు. మహిళల పోరాట స్పూర్తిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో "స్టాండ్ విత్ హర్" కార్యక్రమాన్ని ప్రారంభించామని సీఎం తెలిపారు. మహిళలపై ఎక్కడైనా అన్యాయం జరిగితే సమాజం మొత్తం కలిసి వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మహిళల రక్షణ కోసం ప్రతి యువకుడు ఒక బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రశ్నించే ధైర్యం సమాజంలో పెరగాలని ఆయన సూచించారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా విద్య, వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు, సాంకేతిక రంగాల్లో కూడా రాణించాలని ప్రభుత్వం కోరుకుంటోందని సీఎం తెలిపారు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. సోషల్ మీడియా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ కూడా పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి "స్టాండ్ విత్ హర్" అంటూ మహిళలకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళల గౌరవం కాపాడితేనే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
0 Comments