ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ భీమా పేరుతో ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ''2.5 లక్షల ఆరోగ్య బీమా పచ్చి మోసం. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంతా బూటకం. ఇది ఆరోగ్యశ్రీని పూర్తిగా చంపే కుట్ర. పేదోడి సంజీవనిని ప్రైవేట్ పరం చేసేందుకే యూహెచ్సీ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. వైద్యం మీద ప్రభుత్వ భరోసాను లేకుండా చేస్తున్నారు. ప్రైవేట్ భీమా పేరుతో ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఉద్దేశ్య పూర్వకంగా ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మార్చుతున్నారు. ప్రైవేట్ భీమా భారం తప్పా, లాభం లేదని తెలిసినా చంద్రబాబుకి యూహెచ్సీ మీద ప్రేమ చావడం లేదు. ట్రస్ట్ విధానంలోనే ఆరోగ్యానికి భరోసా అని తెలిసినా ఇన్స్యూరెన్స్ కంపెనీలకు రాష్ట్ర ఖజానా దోచిపెట్టాలని చూడటం దుర్మార్గం. పేద ప్రజల ప్రాణాలు కాపాడే ఆరోగ్యశ్రీపై ఇన్ని కుట్రలు ఎందుకు? ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?. ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద రూ.4వేల కోట్లు చెల్లింపులకు మనసు రాని ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు ముందే దోచిపెట్టడానికి వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయి?. ప్రభుత్వం అమలు చేసే ఆరోగ్యశ్రీ విధానాలకు, ప్రైవేట్ భీమా పెట్టే కండిషన్లకు పొంతన ఎక్కడిది?. రూ.2.5 లక్షల లోపు ఆరోగ్య బీమా ఏంటి.. ఆపై ఖర్చును ట్రస్ట్ చెల్లించడం ఏంటి? ప్రైవేట్ బీమా అమలు చేసిన రాష్ట్రాలు ప్రభుత్వ ట్రస్ట్ విధానానికి మార్చుకుంటుంటే, ట్రస్ట్ విధానంలో నడిచే మన రాష్ట్రంలో ప్రైవేట్ బీమాను ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటో చంద్రబాబు చెప్పాలి. ఆరోగ్యశ్రీ కాదని ప్రైవేట్ బీమా పెట్టడం ద్వారా జరిగే లాభం ఏంటో సమాధానం చెప్పాలి. పేదల ఆరోగ్య సంజీవని ఆరోగ్యశ్రీ. దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ మానస పుత్రిక ఈ పథకం. ఆరోగ్యశ్రీ పేద కుటుంబాలకు మరో పునర్జన్మ. ఎంత పెద్ద జబ్బు చేసినా ప్రాణానికి భరోసా. వెంటనే ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రైవేట్కి లింక్ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ట్రస్ట్ విధానంలోనే ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని నడపాలి. ఆసుపత్రులకు బకాయిలు పడ్డ రూ.3 వేల కోట్లను తక్షణం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం'' అని షర్మిల పేర్కొన్నారు.
0 Comments