ఆంధ్రపదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలో 'హనుమాన్' ప్రాజెక్ట్ ప్రారంభించారు. వన్యప్రాణులు-మానవ సంఘర్షణలను తగ్గించి, అటవీ సంరక్షణను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. "వసుధైక కుటుంబం" భావనతో వన్యప్రాణులను కాపాడుకోవడం మానవ మనుగడకు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వంద ప్రత్యేక వాహనాలను ఆయన ప్రారంభించారు. ఇందులో 93 రాపిడ్ రెస్పాన్స్ వాహనాలు, గాయపడిన జంతువుల కోసం ఏడు అత్యాధునిక అంబులెన్సులు ఉన్నాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లూటిలలో వన్యప్రాణి రెస్క్యూ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, వెటర్నరీ సిబ్బంది, గిరిజన సహాయకులు ఉంటారు. గ్రామ స్థాయిలో పాములు వంటి వన్యప్రాణుల నుంచి రక్షణ కోసం 'వజ్ర' బృందాలను శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారు. వన్యప్రాణుల దాడుల్లో మరణించిన వారి ఎక్స్గ్రేషియాను ₹5 లక్షల నుండి ₹10 లక్షలకు, గాయపడిన వారికి ₹2 లక్షలకు పెంచారు. గతేడాది 2,107 సంఘర్షణ కేసులు నమోదవ్వగా, ₹4 కోట్ల పరిహారం చెల్లించారు. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగుల సమస్య నివారణకు కర్ణాటక నుంచి 'కుమ్కీ' ఏనుగులను తెప్పించి విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించారు. వన్యప్రాణుల కదలికలను పసిగట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీపీఎస్ ట్రాకింగ్, 'హనుమాన్' యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఉత్తమ సేవలందించిన అటవీ సిబ్బందిని ఈ సందర్భంగా సత్కరించారు.
0 Comments