Ad Code

రైల్ పార్సిల్ యాప్ : ఇంటి వద్దనే పార్సిల్‌ బుకింగ్‌, డెలివరీ సర్వీసులు


రైల్ పార్సిల్ యాప్ పేరుతో లాగిస్టిక్ సర్వీస్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే - హైదరాబాద్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో రైల్ పార్సెల్ యాప్ డెవలప్ చేసింది. సికింద్రాబాద్ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ రైల్ పార్సెల్ యాప్‌ని లాంచ్ చేశారు. ఇంటి వద్దనే పార్సిల్‌ బుకింగ్‌, డెలివరీ సర్వీసులను అందించే లక్ష్యంతో 'రైల్‌ పార్సిల్‌ యాప్‌'ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతీయ రైల్వేలో మొట్టమొదటగా ఈ పైలెట్‌ ప్రాజెక్టును హైదరాబాద్‌ డివిజన్‌లో అమలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. మొదటగా 7 నగరాల్లో రైల్ పార్సిల్ యాప్ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, బెంగుళూరు, చెన్నైలలో ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ఇతర మూడు లాగిస్టిక్ పార్టన్స్‌తో కలిసి డోర్ టు, మిడిల్, మెయిన్ డెలివరీ సర్వీసులుకి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం మాట్లాడుతూ ప్రజలు నేరుగా ఇంటివద్దనుంచే ఈ సేవలని వినియోగించుకోవచ్చని సూచించారు. రైల్వే పార్సిల్ యాప్‌తో అతి సులువుగా, వేగంగా పార్సిల్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. దీంతోపాటు దక్షిణ మధ్య రైల్వేలో ఫ్రైట్‌ లాజిస్టిక్స్‌ మార్కెట్‌పై అధ్యయనం చేయడానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)- బెంగళూరుతో అవగాహన ఒప్పందం చేసుకుందని వివరించారు. ఫస్ట్‌ మైల్‌ (పికప్‌), మిడ్‌ మైల్‌ (రైల్వే ద్వారా రవాణా), లాస్ట్‌ మైల్‌ (డెలివరీ) సేవలను సమగ్ర డిజిటల్‌ ప్లాట్‌ఫాం అనుసంధానించేలా సేవలు ఉంటాయని తెలిపారు. ఇది పార్సిల్‌ కదలికలను సులభతరం చేస్తుందని తెలిపారు. వినియోగదారులు ఇంటి నుంచి పార్సిల్‌ సరుకులను బుకింగ్‌ చేయడానికి, ట్రాక్‌ చేయడానికి వన్‌స్టా్‌ప్ వేదికగా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని వెల్లడించారు. పరిశ్రమ, వ్యక్తులు, వ్యాపారాలు, లాజిస్టిక్స్‌ భాగస్వాములను ఒకే డిజిటల్‌ పర్యావరణ వ్యవస్థ కిందకు తీసుకురావడానికి ఈ యాప్‌ని రూపొందించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu