స్మార్ట్ ఫోన్ స్క్రీన్ వైపు మనం చూస్తున్నప్పుడు మన కళ్లు మాత్రమే పని చేయడం లేదు, మన మెదడులో ఒక రసాయన యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు విడుదలయ్యే డోపమైన్ అనే రసాయనం మనల్ని ఒక రకమైన ‘డిజిటల్ మత్తు’కు గురిచేస్తోంది. గతంలో ఒక పుస్తకాన్ని గంటల తరబడి చదవగలిగే మన మెదడు, ఇప్పుడు 30 సెకన్ల రీల్స్ చూడటానికే అలవాటు పడిపోయింది. దీనివల్ల లోతైన ఆలోచన చేసే శక్తి తగ్గిపోయి, మన ఏకాగ్రత చెల్లాచెదురవుతోంది. దీన్నే శాస్త్రవేత్తలు ‘పాప్కార్న్ బ్రెయిన్’ అని పిలుస్తున్నారు. ఏ సమాచారం కావాలన్నా గూగుల్ ఉంది కదా అనే ధీమాతో మన మెదడు విషయాలను గుర్తుంచుకోవడం మానేస్తోంది. దీనివల్ల షార్ట్ టర్మ్ మెమరీ దెబ్బతినే ప్రమాదం ఉంది. మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రం మొద్దుబారిపోతోంది. స్క్రీన్ల నుండి వచ్చే నీలి కాంతి మన మెదడులో ‘మెలటోనిన్’ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. దీనివల్ల నిద్రలేమి కలగడమే కాకుండా, మరుసటి రోజు చిరాకు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు దారితీస్తోంది. స్క్రీన్ టైమ్ పెరిగే కొద్దీ మనుషులతో నేరుగా మాట్లాడే సందర్భాలు తగ్గిపోతున్నాయి. ఇది సామాజిక నైపుణ్యాలను తగ్గించి, ఒంటరితనాన్ని పెంచుతోంది. ముఖ్యంగా పిల్లల్లో భావోద్వేగాలను అర్థం చేసుకునే శక్తి తగ్గుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడును మళ్లీ రీఛార్జ్ చేయాలంటే ‘డిజిటల్ డిటాక్స్’ తప్పనిసరి. రాత్రి పడుకునే గంట ముందు ఫోన్ను దూరంగా ఉంచడం భోజనం చేసేటప్పుడు స్క్రీన్లు చూడకపోవడం వంటి చిన్న మార్పులు మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
0 Comments