చెన్నైలో ఇండియా టుడే నిర్వహించిన తమిళనాడు రౌండ్టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు. పలు అంశాలపై మాట్లాడారు. డీఎంకే సవాళ్లు, రాహుల్ గాంధీతో సత్సంబంధాలు, కాంగ్రెస్తో పొత్తు, సీట్ల పంపకాల గురించి ప్రస్తావించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిపై ఘాటు విమర్శలు గుప్పించారు. డీఎంకే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. విభేదాల వార్తలను ఖండించారు. రాహుల్ గాంధీతో తనకు సోదర అనుబంధం ఉందని స్టాలిన్ పేర్కొన్నారు. తన సొంత తమ్ముడిగా భావిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కు కేటాయించాల్సిన మంత్రి పదవులపై స్పష్టత ఇవ్వలేదు గానీ 2021 కంటే కూడా మరింత పురోగతి సాధిస్తామని తేల్చి చెప్పారు. తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి బలంగా ఉందని, తాము కలిసే ఈ ఎన్నికలలో పోటీ చేస్తామనీ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో అధికార పంపకం ప్రశ్న ప్రస్తుతానికి తలెత్తదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ ఎన్డీఏను తీవ్రంగా విమర్శించారు. బీజేపీది "డబుల్ ఇంజిన్" కాదని, "డబ్బా ఇంజిన్" అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు "ఆర్యులు-ద్రవిడుల మధ్య యుద్ధం"గా అభివర్ణించారు. తప్పుడు సమాచారం, ద్వేషం, మత ఉద్రిక్తతలను బీజేపీ వ్యాపింపజేస్తోందని ఆరోపించారు. మైనారిటీలతో విభేదాలను పెంచడానికి ఎన్డీఏ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. తమిళనాడులో మత రాజకీయాలకు స్థానం లేదని స్పష్టం చేశారు. 2021 ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు గెలుచుకుంది. సొంతంగా అధికారం చేపట్టింది. కాంగ్రెస్ 18 సీట్లు గెలుచుకున్నా కూడా.. మంత్రి పదవులు దక్కలేదు. కాంగ్రెస్ కు బెర్తులను కేటాయించడానికి పెద్దగా ఇష్టపడలేదు స్టాలిన్. ఇది ఈ రెండు పార్టీల మధ్య విభేదాలకు దారి తీసింది. కాంగ్రెస్ ఈసారి గట్టిగా బేరం ఆడుతోంది. రాష్ట్రంలో డీఎంకే తమను అణచివేస్తోందని ఆరోపిస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే అధికార పంపకం కోరుతోంది.
0 Comments