Ad Code

ఢిల్లీతో పోటీ పడుతూ ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం


ఢిల్లీతో పోటీ పడుతూ ముంబైలో వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇటీవల ఏక్యూఐ ఏకంగా కొన్నిచోట్ల 300 పాయింట్లు దాటింది. సాధారణంగా 50 లోపు ఉంటే ఆరోగ్యం. 51-100 వరకు ఉంటే ఫర్వాలేదు. కానీ, 100 దాటితే ఆందోళనకరం. అలాంటిది ముంబైలో ఏక్యూఐ వారం రోజులుగా 100 పైనే నమోదవుతోంది. ఈ నెల 17న 123, 18న 78, 19న 153, 20న 318, 21న 259, 22న 240, 23న 190, 24న 250 పాయింట్లుగా నమోదైంది. ఈ తరహాలో వాయు కాలుష్యం శీతాకాలంలో, ఢిల్లీలో నమోదవుతుంటుంది. అయితే, ఇప్పుడు ఇది ముంబైలోనూ మొదలవ్వడం ఆందోళనకరం. సాధారణంగా ముంబైలో చేపల వాసన, సముద్ర నీటి నుంచి వచ్చే ఉప్పు గాలి వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. కానీ, ఇప్పుడు అక్కడి ప్రజలు వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం, సిటీలో చెత్తను తగలబెట్టడం ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే నిర్మాణ రంగం నుంచి వచ్చే సన్నని ఇసుక, రోడ్లపై నుంచి లేచే మట్టి వంటివి కూడా వాయుకాలుష్యానికి కారణాలు. ముంబైలో బిల్డింగుల కూల్చివేతలు, కొత్తవి నిర్మించడాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. వీటికి సంబంధించి సిమెంట్, ఇసుక వంటి వ్యర్థాలు గాలిలో ఎక్కువగా కలిసిపోతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, వాహనాల కాలుష్యం వంటివి కూడా ముంబైలో గాలి నాణ్యత తగ్గడానికి కారణాలు. ఇక ముంబైలో కాలుష్యం పెరగడంపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక బీఎంసీ, ఎన్ఎంఎంసీ అధికారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ విషయంలో విఫలమైతే బీఎంసీ, ఎన్ఎంఎంసీ కమిషనర్లకు వేతనాలు ఆపాలని కూడా సూచించింది. వాయు కాలుష్యం ఇంతలా పెరిగిపోతున్నా అరికట్టడంలో విఫలమవుతున్న స్థానిక నాయకత్వం, ప్రభుత్వంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu