Ad Code

2047 విజన్ లో భాగంగా నీటి భద్రతపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది !


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సాగునీటి రంగంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ  2047 విజన్ లో భాగంగా నీటి భద్రతపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రకటించారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు నిర్వహించే బాధ్యత తమ ప్రభుత్వానికే వచ్చిందన్నారు. నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 20 నెలలుగా సాగునీటి ప్రాజెక్టులపై రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. వెలిగొండ పూర్తి చేసి మార్కాపురం సహా వివిధ ప్రాంతాలకు న్యాయం చేస్తామన్నారు. రూ.2 వేల కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని, పుష్కరాలకంటే ముందు ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తమని చంద్రబాబు తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేసి ఏలూరు, కృష్ణా జిల్లాలకు నీరు అందిస్తామన్నారు. ప్రస్తుతం 793 టీఎంసీల నీటితో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లూ కళకళ లాడుతున్నాయని, మే 15న నారుమళ్లకు నీరు ఇస్తామని ప్రకటించారు. నీటి నిర్వహణ నుంచి పొదుపు చేసే వరకూ నీటి వినియోగదారుల సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భూగర్భజలాలు గణనీయంగా పెరగటంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ మోటార్ల ద్వారా వినియోగం తగ్గిందన్నారు. పోలవరం-నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని, గతంలో గోదావరి పై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకూ దీని వల్ల లాభం కలుగుతుందన్నారు. కాబట్టి పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ పై స్పందిస్తూ కొందరు రాజకీయం కోసమే నీటి సమస్యల్ని తీసుకువస్తున్నారన్నారు. ఏపీకి ఉండే వాటర్ సెక్యూరిటీ దక్షిణ భారత్ లో మరే రాష్ట్రానికి లేదని, భూమినే జలాశయంగా మార్చి నీటి సంరక్షణ చేయాలని పిలుపునిచ్చారు. సాగునీరు, పరిశ్రమలకు నీరు, ప్రతీ ఇంటికీ తాగునీరు ఇస్తే లక్ష్యాన్ని సాధించినట్టే అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఓ బ్లూ ప్రింట్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu