చెన్నై పారిశుధ్య కార్మికురాలు పద్మకు సూపర్స్టార్ రజనీకాంత్ బంగారు గొలుసును బహూకరించారు. ఇటీవల రోడ్డుపై తనకు లభించిన రూ.45 లక్షల బంగారు నగల గురించి పైఅధికారులకు పద్మ సమాచారం అందించారు. ఆ తరువాత వాటిని పోలీసులకు అప్పగించి తన నిజాయతీని చాటుకున్నారు. మంగళవారం సూపర్ స్టార్ రజనీకాంత్ను చెన్నైలోని ఆయన నివాసంలో పద్మ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను రజనీకాంత్ అభినందించారు. గోల్డ్ చెయిన్ను బహూకరించారు. అంతకుమునుపు, రజనీకాంత్ తన వీరాభిమాని రజనీ శేఖర్ను కూడా అభినందించారు. రజనీ శేఖర్ మదురైలో ఓ చిన్న ఫుడ్స్టాల్ను నిర్వహిస్తుంటారు. స్టాల్కు రజనీకాంత్ పేరే పెట్టుకున్నారు. తన స్టాల్లో పరాఠాలు అందరికీ అందుబాటులో ఉండేలా కేవలం రూ.5లకే విక్రయిస్తూ రజనీకాంత్ దృష్టిని ఆకర్షించారు. దీంతో, రజనీశేఖర్కు సూపర్ స్టార్ గోల్డ్ చెయిన్ను ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కే స్టాలిన్ కూడా పారిశుధ్య కార్మికురాలు పద్మను అభినందించారు. ఆమె నిజాయతీకి అభినందనగా రూ.1 లక్ష చెక్కును అందించారు. పద్మ టీ నగర్లో పారిశుధ్య కార్మికురాలిగా చేస్తున్నారు.
0 Comments