Ad Code

హిందూ సంఘానికి చెందిన వ్యక్తుల వేధింపు : పిజ్జా షాపు రెండో అంతస్తు నుంచి దూకేసిన ప్రేమికులు : ఇద్దరికీ తీవ్ర గాయాలు


త్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో శనివారం సాయంత్రం ఓ పిజ్జా షాపులో కూర్చున్న యువ ప్రేమికుల జంటను ఓ హిందూ సంఘానికి చెందిన వ్యక్తులు చుట్టుముట్టి వేధించడంతో వారు భయంతో రెండో అంతస్తు కిటికీ నుంచి కిందకు దూకేశారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు షాజహాన్‌పూర్‌లోని బరేలీ మోర్ సమీపంలో ఉన్న ఓ బిల్డింగ్ రెండో అంతస్తులో పిజ్జా షాపు ఉంది. శనివారం సాయంత్రం 21 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి అక్కడ కూర్చుని ఆహారం కోసం వేచి చూస్తున్నారు. ఆ సమయంలో ఓ హిందూ సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించడం ప్రారంభించారు. వారు ఏం తింటున్నారని, వారి కులాలు ఏంటని సదరు వ్యక్తులు నిలదీశారు. తాము నూడుల్స్ ఆర్డర్ ఇచ్చామని, తామిద్దరం హిందువులమేనని ఆ జంట తెలిపింది. వారు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని ఆ వ్యక్తులు, వారిని ప్రశ్నిస్తూ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అపరిచిత వ్యక్తుల ప్రవర్తనతో తీవ్ర భయాందోళనకు గురైన యువకుడు, అక్కడి కిటికీ ఊచను తొలగించి రెండో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. అతన్ని చూసి వెంటే ఉన్న యువతి కూడా కిందకు దూకేసింది. కింద పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ రాజేష్ ద్వివేది కేసు విచారణ చేపట్టారు. "సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదు. బాధితులు లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం," అని ఎస్పీ వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో ఆ వ్యక్తులు ఏ సంఘానికి చెందిన వారనేది పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Post a Comment

0 Comments

Close Menu