ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి శ్రీకాకుళం నుంచి భీమవరం బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాకినాడ జిల్లా చేబ్రోలు గ్రామం సత్తెమ్మ తల్లి ఆలయం వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9మంది గాయపడ్డారు. వీరిని స్థానికులు హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.35 మంది ప్రయాణికులతో బస్సు శ్రీకాకుళం నుంచి భీమవరం బయలుదేరింది. మార్గం మధ్యలో బస్సు బోల్తాపడటంతో అంతా ఆందోళన గురయ్యారు. పండగ సెలవులు పూర్తి కావడంతో ఎవరి ఇళ్లకు వారు బయలుదేరే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా పలువురు ఆరోపిస్తున్నారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను వేరే బస్సులో సురక్షితంగా పంపించారు.
0 Comments