Ad Code

కళ్యాణ్ జ్యువెలర్స్‌లో రూ. 14 లక్షల విలువైన నగలు దొంగతనం : గుర్తు తెలియని మహిళల హస్తలాఘనం


త్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌, సివిల్ లైన్స్‌లో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌లో దొంగతనం జరిగింది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం ముగ్గురు గుర్తు తెలియని మహిళలు షోరూమ్‌లోకి ప్రవేశించి, సేల్స్‌మెన్‌ను బంగారు కమ్మలు చూపించమని అడిగారు. షాపు వారు వారికి రకరకాల నగలు చూపించడంలో నిమగ్నమై ఉండగా, వారు అదను కోసం వేచి చూశారు. సేల్స్‌మెన్ కొద్దిసేపు కౌంటర్ నుండి పక్కకు వెళ్లగానే, ఒక మహిళ అత్యంత వేగంగా డిస్‌ప్లే బోర్డు నుండి బంగారు నగలు ఉన్న ట్రేని తీసి వెంటనే ఆ ట్రేని పక్కనే ఉన్న మరో మహిళకు అందించగా, ఆమె క్షణంలో ఆ నగలను తన శాలువాలో దాచేసింది. ఈ దొంగతనం ఎంత వృత్తిపరంగా జరిగిందంటే, పక్కనే కూర్చున్న ఇతర కస్టమర్లు కానీ, సెక్యూరిటీ గార్డులు కానీ దీనిని గమనించలేకపోయారు. నగలు దొంగిలించిన తర్వాత వారు ఏమీ ఎరుగనట్లు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత షోరూమ్ సిబ్బంది స్టాక్ చెక్ చేయగా, కొన్ని బంగారు కమ్మలు కనిపించలేదు. వెంటనే సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, ఆ ముగ్గురు మహిళల చేతివాటం బయటపడింది. దొంగిలించిన నగల విలువ సుమారు రూ. 14 లక్షలు ఉంటుందని అంచనా. షోరూమ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు సివిల్ లైన్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి షోరూమ్ లోపల, బయట ఉన్న రోడ్లపై ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. వారు ఏ మార్గం ద్వారా పారిపోయారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రామ్ ఆశ్రే యాదవ్ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu