బెంగళూరులో మంగళవారం సాయంత్రం కలకలం రేపిన హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల వయసున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన భార్యను తుపాకీతో కాల్చి హత్య చేసి అనంతరం సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు భువనేశ్వరి (39) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బసవేశ్వరనగర్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆమె కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, మాగడి రోడ్ సమీపంలో నిందితుడు బాలమురుగన్ ఆమెను అడ్డగించి పిస్టల్తో దగ్గరి నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భువనేశ్వరిని షాన్బాగ్ ఆసుపత్రికి తరలించినా, అక్కడికి చేరుకునేలోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 2011లో భువనేశ్వరి-బాలమురుగన్ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ తమిళనాడులోని సేలం జిల్లా వాసులు కాగా, ఉద్యోగాల కారణంగా బెంగళూరులో స్థిరపడ్డారు. గత 18 నెలలుగా వైవాహిక జీవితంలో తలెత్తిన విభేదాల కారణంగా వీరిద్దరూ వేరువేరుగా నివసిస్తున్నారు. భువనేశ్వరి తన భర్త నుంచి దూరంగా ఉండేందుకు ఆరు నెలల క్రితం వైట్ఫీల్డ్ నుంచి రాజాజీనగర్కు మారింది. అయితే, బాలమురుగన్ ఆమెపై అనుమానంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్లి, నాలుగు నెలల క్రితం కెపి అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని చోళుర్పాళ్యలో నివాసం ఏర్పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితమే నిందితుడు భువనేశ్వరికి విడాకుల కోసం లీగల్ నోటీసు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. వెస్ట్ డివిజన్ డీసీపీ ఎస్. గిరీష్ తెలిపిన వివరాల ప్రకారం, బాలమురుగన్ గతంలో ప్రైవేట్ ఐటీ సంస్థలో పనిచేశాడు. అయితే, గత నాలుగు సంవత్సరాలుగా నిరుద్యోగిగా ఉన్నాడు. హత్య అనంతరం నిందితుడు మాగడి రోడ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి నేరాన్ని అంగీకరించి, ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసి, మరింత విచారణ చేపట్టారు.
0 Comments