కార్తీకమాసంలో అయ్యప్పస్వామి భక్తులు లక్షల సంఖ్యలో మాలధారణ చేస్తోన్నారు. దశలవారీగా వారంతా కూడా శబరిమలకు తరలి వెళ్తుంటారు. ఎక్కువ మంది స్వాములు రైళ్ల మీదే ఆధారపడతారు. వారి కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని వివిధ స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచీ ప్రత్యేక రైళ్లు కేరళకు రాకపోకలు సాగించనున్నాయి. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి మహారాష్ట్ర నాందెడ్ వరకు పలు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన తేదీలు, హాల్ట్ స్టేషన్లు, టైమ్ టేబుల్, పూర్తి వివరాలను విడుదల చేశారు. తొలి రైలు ఈ నెల 18వ తేదీన పట్టాలెక్కనుంది. చివరి రైలు డిసెంబర్ 31వ తేదీన బయలుదేరి వెళ్తుంది. ఈ నెల 18 నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:20 నిమిషాలకు నాందెడ్ నుంచి బయలుదేరే నంబర్ 07615 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు తిరుచిరాపల్లికి చేరుకుంటుంది. ఈ నెల 19 నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు ప్రతి బుధవారం రాత్రి 9 గంటలకు తిరుచిరాపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07616 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 11 గంటలకు నాందెడ్ కు చేరుకుంటుంది. ముద్ఖేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, తిరువణ్ణామలై, తిరుక్కోవిలూర్, విల్లుపురం, విరుధాచలం, అరియలూర్, శ్రీరంగం మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
0 Comments