దేశంలో సిప్లా ఉబ్బసం (ఆస్తమా) స్క్రీనింగ్ కోసం మొబైల్ అప్లికేషన్ సిప్లా ఎయిర్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ యాప్ వినియోగదారులకు ఉబ్బసం వచ్చే అవకాశాలను ముందే గుర్తించడం ద్వారా వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే నిర్ధారిస్తుంది. సిప్లా ఎయిర్ స్క్రీన్పై ఉన్న వర్చువల్ క్యాండిల్ను ఆర్పివేసే క్రమంలో దృష్టి కేంద్రీకరించేటప్పుడు వినియోగదారులు మూడు ఉచ్చ్వాసాలను నిర్వహించాలి. ఈ యాప్ పరీక్ష ఉచ్చ్వాసాల నాణ్యతపై తన అభిప్రాయాన్ని అందిస్తుంది. ఉబ్బసాన్ని సూచించే ధ్వని నమూనాలను గుర్తించడానికి ఉచ్చ్వాస శబ్దాలను విశ్లేషిస్తుంది. ఫలితాలు రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్లుగా డిస్ప్లే అవుతాయి. ఈ పరీక్ష, వినియోగదారులకు ఈ వ్యాధికి సంబంధించి ముందస్తు రోగనిర్ధారణను సులభతరం చేస్తుంది. ఉబ్బసం ఉన్న వ్యక్తులకు వారి పరిస్థితిని తెలియజేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు వెళ్లేలా తగు సూచనలు ఇస్తుందని సిప్లా తెలిపింది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నివేదిక ప్రకారం భారత్లో 3.43 కోట్ల మంది ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఉబ్బస సంబంధిత మరణాల రేటు మూడు రెట్లు ఎక్కువ ఉండడంతో పాటు దీనివల్ల వైకల్య భారం ప్రపంచ సగటు కంటే రెండింతలు ఎక్కువ ఉంది. ప్రస్తుతం సిప్లా ఎయిర్ ఆండ్రాయిడ్ లో అందుబాటులో ఉంది, త్వరలో iOS పరికరాల్లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. సిప్లా డిజిటల్ హెల్త్ లిమిటెడ్ బ్రీత్ఫ్రీ మొబైల్ అప్లికేషన్ను కూడా ప్రారంభించింది. శ్వాస వ్యాయామాలు, లైవ్ యోగా సెషన్లు, డైట్ ప్లాన్లు, మెడిసిన్ రిమైండర్లు, ఇన్హేలర్ ట్రాకింగ్తో సహా శ్వాసకోశ సంరక్షణ కోసం అనేక సేవలను అందించే వేదికలా ఈ అప్లికేషన్ పనిచేస్తుంది.
0 Comments