Ad Code

హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ !


దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు గూగుల్ ముందుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే ఐదవది. ఏషియా పసిఫిక్ జోన్ లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ ఇదే. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్ గా నిలబోతుంది. ఇది అధునాతన భద్రత మరియు ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యాధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రత, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకార వేదికగా ఉపయోగపడుతుంది. దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, ఉపాధి పెంచడం, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించే లక్ష్యంగా ఈ గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ పని చేస్తుంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులున్న గూగుల్ ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2024 కాన్‌క్లేవ్‌లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని ఆ కంపెనీ ప్రకటించింది. అప్పటి నుంచి జీఎస్ఈసీని తమ రాష్ట్రంలోనే నెలకొల్పాలని, గూగుల్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు వివిధ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఈ అత్యాధునిక సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. హైదరాబాద్ లో ఈ సేఫ్టీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావటం చాలా ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గూగుల్ తో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య ఒప్పందం చేసుకోవటంతో మరోసారి హైదరాబాద్ ప్రపంచంలో మేటీ ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్‌ అధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం ఈరోజు (బుధవారం) జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హాన్సెన్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు. 'ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచంలో పేరొందిన అయిదు టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ ఇక్కడే ఉన్నాయి.. ఇప్పుడు సేఫ్టీ సెంటర్ ద్వారా స్థాయిలో సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంగా పరిష్కరించే వీలుంటుందను హోన్సెన్ అభిప్రాయపడ్డారు. ఈ సెంటర్ ఏర్పాటుతో వేల సంఖ్యలో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu