ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈనెల 15 నుంచి పనులు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అమరావతి ప్రాంతంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల నివాసానికి అనుగుణంగా చేపట్టిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ను నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాలను పూర్తి చేసే బాధ్యతను కేఎంవీ సంస్థకు, ఇతర అఖిల భారత సర్వీసు అధికారుల అపార్ట్మెంట్లు, గెజిటెడ్ అధికారుల నివాసాలను పూర్తి చేసే టెండర్ను ఎన్సీసీ దక్కించుకుంది. నాన్ గెజిటెడ్ అధికారుల ఆవాసాలను పూర్తి చేసే పనుల టెండర్ ఎల్అండ్టీకి వచ్చింది. మరోవైపు జడ్జిలు, మంత్రుల బంగ్లాల నిర్మాణాల ప్రాజెక్టు టెండర్ బీఎస్ఆర్ ఇన్ ఫ్రాకు వచ్చింది. ఈ భవనాల నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.1,872 కోట్లుగా సీఆర్డీఏ తేల్చింది. దశలవారీగా భవన నిర్మాణాల పనుల్ని ప్రారంభించి వాటిని పూర్తి చేయాలని నిర్ణయించారు. డిసెంబరు 15 నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారులు, ఎన్జీవో హౌసింగ్, మంత్రులు, జడ్జిల నివాస బంగ్లాల నిర్మాణ పనులు పునఃప్రారంభం కానున్నాయి. శాసన సభ్యులు, ఐఏఎస్ల క్వార్టర్లను పూర్తి చేసేందుకు 6 నెలలు గడువు విధించారు. గెజిటెడ్ అధికారులు, న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల నిర్మాణాలను 9 నెలల్లో పూర్తి చేయనున్నారు.
0 Comments