ఆంధ్రప్రదేశ్ లో అక్టోబరు 22, 23 తేదీల్లో జరగనున్న అమరావతి డ్రోన్ సదస్సు-2024 నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సదస్సు నిర్వహణకు రూ.5.54 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో రెండు రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్బన్ ప్లానింగ్, శాంతి భద్రతలు, వస్తు ఉత్పత్తి రంగాల్లో డ్రోన్ల వినియోగంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి పెట్టనుంది. వాణిజ్య పరంగా డ్రోన్ల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ మ్యాప్కు ఈ సమ్మిట్లో రూపకల్పన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సహా కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి పుల్నమ్ హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, డ్రోన్ తయారీ నిపుణులు సమ్మిట్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. సమ్మిట్కు వచ్చే వారు 'అమరావతి డ్రోన్ సమ్మిట్' వెబ్సైట్లో ఈనెల 15 వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈనెల 22న దేశంలో ఎక్కడా జరగని విధంగా 5 వేల డ్రోన్లతో విజయవాడలో డ్రోన్ షో నిర్వహించనున్నారు. భారీ డ్రోన్ షోను ప్రజలు ఉచితంగా వీక్షించవచ్చు. అత్యాధునిక సేవలందించే డ్రోన్లు తయారు చేసిన వారికి ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నారు.
0 Comments