Ad Code

టెల్‌ అవీవ్‌కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలని పాలస్తీనా మద్దతుదార్ల ఆందోళన !


గాజా-ఇజ్రాయెల్‌ యుద్ధం ముగించాలని, టెల్‌ అవీవ్‌కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలని పాలస్తీనా మద్దతుదార్ల ఆందోళనతో అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం పరిసరాలు దద్దరిల్లాయి. దాదాపు 35,000 మంది నిరసనకారులు దీనిలో పాల్గొన్నారు. వీటిని ముందే ఊహించిన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఆందోళనల్లో పాల్గొన్న వారు చాలా మంది ఎర్రని వస్త్రాలు ధరించి, ఫ్రీ పాలస్తీనా, ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం ఆపేయాలని నినాదాలు చేశారు. కొందరు ఆందోళనకారులు దాదాపు రెండు మైళ్ల పొడవైన బ్యానర్‌ను శ్వేత సౌధం వద్ద ప్రదర్శించారు. ఆపరేషన్‌ రఫాలో ఇజ్రాయెల్‌ రెడ్‌లైన్‌ దాటడంపై నిరసనగా దీనిని ప్రదర్శించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి రఫాలోనే పాలస్తీనా వాసులు తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. పొగ వెదజల్లే వస్తువులను శ్వేత సౌధ ప్రాంగణంలోకి నిరసనకారులు విసిరేశారు. ఈ సమయంలో అధ్యక్షడు జోబైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ ఇంట్లో లేరు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న డీడే స్మారక కార్యక్రమల్లో పాల్గొననున్నారు. మరోవైపు వాషింగ్టన్‌ డీసీ మెట్రో పోలీసులు, సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం దీనిపై స్పందిస్తూ తాము ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని వెల్లడించారు. నేరుగా శ్వేత సౌధానికి వెళ్లే రహదారి సహా పలు మార్గాలను మూసివేశారు. అమెరికాలో గత నెలలో పాలస్తీనా అనుకూల ఆందోళనలు మొదలయ్యాయి. విద్యాసంస్థల్లో తీవ్ర స్థాయిలో ఇవి జరుగుతున్నాయి. ఈ ఆందోళనల దెబ్బకు వంతెనలు, వైట్‌హౌస్‌కు దారి తీసే రోడ్లను మూసేసి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu