Ad Code

రెగ్యులేటర్‌ను ఆన్‌ చేసి గోదావరి నీటిని ఉత్తరాంధ్ర వైపు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్‌ పురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్‌ను ఆన్‌ చేసి గోదావరి నీటిని ఉత్తరాంధ్ర వైపు విడుదల చేశారు. దీంతో ఈ ప్రాంతంలో సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మరింత ఊతం లభించనుంది. ఈ కార్యక్రమానికి ముందు సీఎం చంద్రబాబు పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రయాణిస్తూ అక్కడకు చేరుకున్న ప్రజలకు అభివాదం చేశారు. కాలువ వద్దకు చేరుకున్న తర్వాత గోదారమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, అచ్చెన్నాయుడు, ఎంపీ సి.ఎం. రమేశ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.4,192 కోట్లను ఖర్చు చేసింది. ఈ కాలువ ద్వారా అందుబాటులోకి వచ్చే గోదావరి నీటిని వివిధ ప్రాంతాలకు వినియోగించేలా జల వనరుల శాఖ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా అనకాపల్లి వద్ద ఉన్న ఏలేరు కాలువకు నీటిని అందించడంతో పాటు జిల్లాలోని 110 చెరువులను కూడా గోదావరి జలాలతో నింపాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల సాగునీటి లభ్యత పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. గోదావరి నీటితో ఇప్పటికే ఉన్న ఆయకట్టు ప్రాంతాలను స్థిరీకరించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలకు, ఏలేరు కింద 80 వేల ఎకరాలకు నీటి ప్రయోజనం కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా పంపా ఆయకట్టు కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడిగడ్డ ఆయకట్టు పరిధిలోని మరో 46,620 ఎకరాలకు నీటి స్థిరీకరణ చేపట్టనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వ్యవసాయానికి నీటి భద్రత మరింత పెరగనుంది. 23.44 టీఎంసీల గోదావరి జలాలను విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ నీటిని కేవలం వ్యవసాయ అవసరాలకే పరిమితం చేయకుండా తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కూడా వినియోగించనున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఈ జలాలు కీలకంగా మారనున్నాయి. మరోవైపు సాగునీటి విస్తరణతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకోవడంతో ఈ ప్రాంత అభివృద్ధిలో ఇది కీలక ముందడుగుగా నిలిచింది.

Post a Comment

0 Comments

Close Menu