ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేసిన అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. ప్రస్తుతం మగవారితో సమానంగా ఆడవారు ఎదిగారని అన్నారు. భవిష్యత్తులో మగవారిని మించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తూ ఆదుకుంటున్నామన్నారు. దేశంలో నాలుగు వేలు, ఆరువేలు, పదివేలు, పదిహేను వేలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే అని అన్నారు. ఇప్పటి వరకూ 75 వేల 503 కోట్ల రూపాయలను పెన్షన్లు ఇచ్చామని, ఆ డబ్బుతో మూడు పోలవరం ప్రాజెక్ట్లు కట్టవచ్చని వ్యాఖ్యానించారు. ఆర్థిక అసమానతలు పోవాలని, అందరికీ సంక్షేమం అందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏజెన్సీలోని పిల్లలకు మెరుగైన విద్య అందిస్తే, ప్రపంచంలోనే మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు. కొన్ని రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని వాటిని మహిళలు నడపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలు ఉచితంగా ఆ బస్సుల్లో ఎక్కే రోజులు రాబోతు న్నాయని తెలిపారు. మహిళలు ఇంటిపైన సోలార్ పెట్టుకుంటే విద్యుత్ తయారు అవుతుందని, దానివలన కొన్ని రోజుల్లో ఉచితంగా కరెంటు పొందవచ్చని సూచించారు. డ్వాక్రా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా చూస్తామని చెప్పారు. డీఎస్సీని అడ్డుకోవడానికి 350 పిటిషన్లు వేశారని, పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తే, కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నట్లు వ్యవహరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నీటిని ఉత్తరాంధ్రకు తీసుకెళ్లబోతున్నామని, చరిత్రను మార్చబోతున్నామని తెలిపారు. భవిష్యత్తులో గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానం చేస్తామని వెల్లడించారు.
0 Comments