ఒకప్పుడు క్రికెట్ రారాజుగా వెలుగొందిన వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయింది. దారుణమైన ప్రదర్శనతో పాతాళానికి పడిపోయింది. గత వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ కూడా వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించకపోగా, క్వాలిఫయర్స్లోనూ పసికూన జట్లతో ఓడి టోర్నీకి దూరమైంది. ఈ సారి కూడా వెస్టిండీస్ అదే పరిస్థితి ఎదుర్కొంటుంది. సోమవారం ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఆప్ఘనిస్థాన్ విజయం సాధించి ప్రపంచకప్ బెర్త్ను దక్కించుకుంది. దాంతో వెస్టిండీస్ ఆశలు ఆవిరయ్యాయి. వన్డే ర్యాంకింగ్స్ ద్వారా నేరుగా టోర్నీకి అర్హత సాధించడానికి ఐసీసీ ఈ సెప్టెంబర్ 30 వరకు డెడ్లైన్ విధించింది. వన్డే ర్యాంకింగ్స్లో టాప్-8లో ఉన్న దేశాలు నేరుగా అర్హత సాధిస్తాయి. ఈ 8 జట్లతో పాటు ఆతిథ్య దేశాలుగా ఉన్న సౌతాఫ్రికా, జింబాబ్వే కూడా క్వాలిఫై అవుతాయి. 8వ స్థానంతో ఆప్ఘన్ నేరుగా క్వాలిఫై అయ్యింది. ప్రస్తుతం వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో పదో స్థానంలో ఉన్న కరేబియన్ టీమ్.. కటాఫ్ తేదీ నాటికి రెండు వన్డేలు మాత్రమే ఆడనుంది. ఆ రెండూ సెప్టెంబర్లో భారత్తోనే జరగనున్నాయి. ఆ రెండింటిలో గెలిచినా వెస్టిండీస్ టాప్-8లో నిలవదు. ఆ జట్టు ప్రపంచకప్లో ఆడాలంటే ఫిబ్రవరి 2027లో నిర్వహించే క్వాలిఫయర్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. లేదంటే వరుసగా రెండోసారి ప్రపంచకప్నకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆప్ఘనిస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 46.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. అనంతరం అఫ్గానిస్థాన్ 44.5 ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసి గెలుపొందింది. ఈ విజయంతో వన్డే ర్యాంకింగ్స్లో 8వ స్థానం అందుకున్న ఆప్ఘనిస్థాన్.. వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధించింది.
0 Comments