అమరావతి అభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు కేవలం కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. అమరావతి ఆయనకు ఒక ఏటీఎం కార్డులా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న ప్రభుత్వ స్వరూపం బయటపడిందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో రెండేళ్ల పాలన పూర్తి కావస్తున్న తరుణంలో ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలు ప్రజల ముందుకు వచ్చాయని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడే చిత్తశుద్ధి తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ అంశంపై శాసనసభలో కూలంకషంగా చర్చించాలని పట్టుబడుతున్నామని పేర్కొన్నారు. తాము సవాళ్లు విసిరితే అధికార పక్షం చర్చకు రాకుండా పారిపోతోందని బొత్స విమర్శించారు.
0 Comments