పబ్జీ మొబైల్ సృష్టికర్తల్లో ఒకరైన ఫరూఖ్ అహ్మద్ కారు యాక్సిడెంట్లో మృత్యువాత పడ్డాడు. కెనడాలోని కాల్గరీలో కారు, తాను ప్రయాణిస్తున్న మోటారుసైకిల్ను ఢీకొట్టడంతో ప్రమాదంలో 28 ఏళ్ల ఫరూఖ్ అహ్మద్ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కాగా ఫరూఖ్ అహ్మద్ మరణవార్తను పబ్ జీ మొబైల్ తన ఎక్స్ వేదికగా ప్రకటనను విడుదల చేసింది. "ఫరూఖ్, నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. పబ్జీ మొబైల్ కమ్యూనిటీ ఒక ఆత్మీయుడిని కోల్పోయాం. ఫరూఖ్ తన సేవలతో మన కమ్యూనిటీకి ఉత్సాహాన్ని అందించడంతో పాటు మరపురాని క్షణాలను అందించాడు. ఆయన మరణవార్త మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అతడి కుటుంబానికి, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి." అని పబ్జీ మొబైల్ తన సంతాపం వ్యక్తం చేసింది. 1998లో పాకిస్తాన్లో జన్మించిన ఫరూఖ్ అహ్మద్, దక్షిణాసియా, అంతర్జాతీయ పబ్ జీ మొబైల్ రంగాలలో తనదైన ముద్ర వేశారు. యూట్యూబ్లో 9,25,000 మందికి పైగా సబ్స్క్రైబర్లను, ఇన్స్టాగ్రామ్లో సుమారు 85,000 మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఆయన, పబ్జీ గేమ్కు అధికారిక మొబైల్ భాగస్వామిగా, కెనడియన్ అంబాసిడర్గా అధికారిక హోదాను పొందారు. పబ్జీ అంటే ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్ అని అర్థం. దక్షిణ కొరియాలోని ఓ గేమింగ్ సంస్థ ఈ మల్టీ ప్లేయర్ గేమింగ్ యాప్ను రూపొందించింది.
0 Comments