తెలంగాణాలో కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి నేటి నుంచి ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రాధాన్యత క్రమంలో ఈ పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు, డయాలసిస్ రోగులు, అలాగే తలసేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా వంటి వ్యాధులతో ఉన్న దివ్యాంగులకు చేయూత పింఛన్ల లో ప్రథమ ప్రాధాన్యత నివ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈనెల 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పింఛన్లను అందుకోవడానికి అర్హత కోసం గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షన్నర రూపాయలు, పట్టణాలలో రెండు లక్షల రూపాయలు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు, మూడు ఎకరాల కంటే ఎక్కువ మాగాణి లేదా ఏడున్నర ఎకరాల కంటే ఎక్కువ మెట్టభూమి ఉన్నవారు ఈ పింఛన్లను తీసుకోవడానికి ప్రభుత్వ అనర్హులుగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, డాక్టర్లు, వృత్తి నిపుణులు, పెట్రోల్ బంకులు, ఆయిల్ మరియు రైస్ మిల్లుల యజమానులు, వారి తల్లిదండ్రులు పింఛన్ తీసుకోవడానికి అనర్హులుగా పేర్కొంది. అంతేకాదు ఇప్పటికే ప్రభుత్వ స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్న వారు, నాలుగు చక్రాల లేదా భారీ వాహనాలు ఉన్నవారిని కూడా ప్రభుత్వ అనర్హులుగా పేర్కొంది. ఈ పింఛన్ పొందాలంటే గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే దరఖాస్తుల యొక్క స్థితిని పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారుల ద్వారా తెలుసుకోవాలి. కొత్తగా దరఖాస్తు చేసేవారు మాత్రం చేయూత వెబ్సైట్ నుంచి ఫారం డౌన్లోడ్ చేసుకొని, దానిని నింపి గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులకు గాని, మండల ప్రజాపరిషత్ కార్యాలయాలలో, పట్టణాలలో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, కమిషనర్ కు గాని సమర్పించాలి.
0 Comments