మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ప్రధాన నిందితుడు దస్తగిరి ఇళ్లు, ఆఫీసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం మెరుపు దాడులు చేపట్టారు. తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని కడప ప్రాంతాల్లో ఏకకాలంలో మొత్తం ఏడు చోట్ల జరిపిన ఈ సోదాల్లో లెక్కింపులోకి రాని రూ.24 లక్షల నగదుతో పాటు రెండు బ్యాంకు లాకర్ తాళాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జోనల్ పరిధిలోని ఈడీ అధికారులు నిర్వహించిన ఈ దాడుల్లో భారీగా కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు లభ్యమయ్యాయి. 2019 మార్చి 15న తన సొంత నివాసంలోనే దారుణ హత్యకు గురైన వివేకానందరెడ్డి కేసును మొదట హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారించింది. సీబీఐ దాఖలు చేసిన మూడు చార్జ్షీట్ల ఆధారంగా ఈడీ ప్రత్యేకంగా మనీ లాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. సీబీఐ మోపిన చార్జ్షీట్లో వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, డి.శివశంకర్ రెడ్డి, వై.సునీల్ యాదవ్ తదితరులను ప్రధాన నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈడీ ప్రకటన ప్రకారం వివేకా హత్య వెనుక భారీ స్థాయిలో సుపారీ డబ్బులు మారినట్లు విచారణలో తేలింది. వైఎస్సార్సీపీలో వివేకానందరెడ్డి తిరిగి క్రియాశీలకం కావడం, రాజకీయంగా ఆయన ప్రభావం పెరుగుతుండటంతోనే హత్యకు ప్లాన్ వేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. డి.శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తామని చెప్పి ఈ కుట్ర పన్నినట్లు ఈ కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తేలింది. ఇందులో భాగంగా రూ.5 కోట్లు ఇస్తామని ఆశచూపి దస్తగిరిని కుట్రలోకి లాగారని, దస్తగిరికి అందిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఇప్పటికే అధికారులు రికవరీ చేశారు. సీబీఐ చార్జ్షీట్లతో పాటు గతంలో సీబీఐ స్వాధీనం చేసుకున్న రూ.46.70 లక్షల నగదు, నగలను ఆధారంగా చేసుకుని ఈడీ డబ్బు లావాదేవీల నెట్వర్క్ను జల్లెడ పడుతోంది. హత్యకు సంబంధించి ఇచ్చిన సుపారీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ నిధుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే అంశాలపై మరింత స్పష్టత ఇచ్చేందుకు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటా, లాకర్ కీలను విశ్లేషిస్తున్నారు. దాడుల అనంతరం స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా నిందితులకు త్వరలోనే సమన్లు జారీ చేసే అవకాశముంది.
0 Comments