అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ ఒక ఉద్యోగిని కేవలం 1.95 డాలర్లు విలువైన కుకీ దొంగిలించాడనే ఆరోపణతో ఉద్యోగం నుంచి తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తర్వాత ఆ ఉద్యోగి తాను కుకీకి డబ్బు చెల్లించినట్లు ఆధారాలు చూపించడంతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటనలో బాధితుడు కర్ట్ క్రోమ్. 60 ఏళ్ల కర్ట్ గత 11 సంవత్సరాలుగా అమెరికాలోని కెంటకీ రాష్ట్రం, లూయిస్విల్లేలో ఉన్న ఫోర్డ్ ట్రక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆయన ఏడాదికి సుమారు 2 లక్షల డాలర్లు (దాదాపు రూ.1.9 కోట్లు) సంపాదిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, గత ఏడాది మాత్రమే కంపెనీ క్యాంటీన్లో 1,200 డాలర్ల (సుమారు రూ.1.14 లక్షలు) విలువైన ఆహారం, కూల్ డ్రింక్స్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఒక రోజు రక్తంలో చక్కెర స్థాయి తగ్గడంతో తల తిరుగుతున్నట్లు అనిపించడంతో కర్ట్, క్యాంటీన్లో Grandma’s Chocolate Chip Cookie కొనుగోలు చేశారు. కొద్ది సేపటికే ఆయనను సూపర్వైజర్ కార్యాలయానికి పిలిచారు. అక్కడ యూనియన్ ప్రతినిధి, సీసీటీవీ వీడియోలో కుకీ దొంగిలించినట్లు కనిపించిందని, కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించబోతోందని చెప్పినట్లు కర్ట్ వెల్లడించారు. ఈ ఆరోపణలపై కర్ట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ఏడాదికి రూ.1.9 కోట్లకు పైగా సంపాదిస్తున్నాను. అలాంటి నేను రూ.186 విలువైన కుకీని ఎందుకు దొంగిలిస్తాను? గత ఏడాది క్యాంటీన్లో రూ.1.14 లక్షలకు పైగా ఖర్చు చేశాను,” అని తెలిపారు. యూనియన్ ప్రతినిధి క్షమాపణ చెప్పాలని సూచించినప్పటికీ, తాను ఎలాంటి తప్పు చేయలేదని క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. తర్వాత తన బ్యాంక్ ఖాతాను పరిశీలించగా, 1.95 డాలర్ల చెల్లింపు విజయవంతంగా జరిగినట్లు గుర్తించారు. ఆ వెంటనే డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ స్క్రీన్షాట్ను ఫోర్డ్ యాజమాన్యానికి, యూనియన్ ప్రతినిధులకు పంపించారు. అయితే కంపెనీ ఆ ఆధారాలను వెంటనే అంగీకరించకుండా, బ్యాంక్ స్టేట్మెంట్ను నోటరీ చేయించి సమర్పించాలని కోరినట్లు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత క్యాంటీన్ నిర్వహిస్తున్న Aramark సంస్థ కర్ట్ కుకీకి చెల్లింపు చేసినట్లు అధికారికంగా ధృవీకరించింది. దీంతో ఫోర్డ్ తిరిగి ఉద్యోగంలో చేరాలని ఆయనకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అయితే అప్పటికే కర్ట్ తన ఇంటికి దగ్గరలో మరో కంపెనీలో మెరుగైన ఉద్యోగాన్ని స్వీకరించారు. కొత్త ఉద్యోగంలో ఆయనకు గంటకు 52.51 డాలర్ల వేతనం, అదనంగా గంటకు 10 డాలర్ల బోనస్ లభిస్తున్నట్లు తెలిపారు. ఫోర్డ్లో మాత్రం గంటకు 48 డాలర్లు మాత్రమే పొందుతున్నట్లు చెప్పారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. రూ.186 విలువైన కుకీ విషయంలో పూర్తి విచారణ లేకుండానే ఉద్యోగిని దొంగగా ముద్రవేసి తొలగించడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
0 Comments