తెలంగాణలోని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నన్ను , నా కార్యాలయాన్ని పూర్తిగా విస్మరించి, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కడియం శ్రీహరి కమిషనర్ ఆఫీస్లో అధికారిక సమీక్షా సమావేశం నిర్వహించారని ఫిర్యాదు చేశారు. మాస్టర్ ప్లాన్లు, శాఖాపరమైన నివేదికలపై ఆదేశాలు జారీ చేయడం మంత్రి పరిధిలోని అంశమని, అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యే దేవాదాయ శాఖ అధికారులను పిలిచి ఎలా ఆదేశిస్తారని సురేఖ ప్రశ్నించారు. కడియం శ్రీహరి చర్య ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి నాంది అని, ఇది కేవలం పరిపాలనా లోపం మాత్రమే కాదని, ఒక శాఖా మంత్రి అధికారాలను బహిరంగంగా ప్రశ్నించే కుట్ర అని ఆమె లేఖలో మండిపడ్డారు. గతంలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను రెచ్చగొట్టి తనపై కడియం శ్రీహరి దుష్ప్రచారం చేశారని కొండా సురేఖ ఆరోపించారు. ఇప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగానే తన్ను నిర్లక్ష్యం చేస్తూ ఆయన తీసుకుంటున్న ఇలాంటి చర్యల వల్ల దేవాదాయ శాఖ అధికార యంత్రాంగంలో తీవ్ర అయోమయం నెలకొందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వ నిబంధనలను, మంత్రి అధికారాలను అతిక్రమించిన కడియం శ్రీహరిపై పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొండా సురేఖ తన లేఖలో కోరారు.
0 Comments