తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. కేవలం ప్రచార ఆర్భాటాలు, రంగుల ప్రకటనలపై ఉన్న శ్రద్ధ.. పేద పిల్లల చదువులు, వారి ప్రాథమిక వసతులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందని ఆక్షేపించారు. నాడు వైఎస్ జగన్ హయాంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, కార్పొరేట్ సంస్థలు అసూయపడేలా వెలిగిపోయిన ప్రభుత్వ పాఠశాలలను.. నేడు చంద్రబాబు, లోకేష్లు కలిసి మళ్లీ 2014-19 నాటి చీకటి రోజుల్లోకి, అధ్వాన్న స్థితికి దిగజార్చారని ఆదిమూలపు సురేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం పిల్లలకు సురక్షిత మంచినీరు, నాణ్యమైన భోజనం కూడా ఇవ్వలేని దుస్థితికి దిగజారిందని... ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాలలు తెరిచి నెల రోజులు కావస్తున్నా విద్యార్థులకు కనీస అవసరాలైన విద్యామిత్ర కిట్లు, బూట్లు, బెల్టులు, బ్యాగులు అందలేదు. జిల్లాలకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు కూడా అరకొరగానే చేరాయ,గతంలో మిగిలిపోయిన పాత స్టాక్తో అడ్జస్ట్ చేసే దౌర్భాగ్య స్థితికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ నేతృత్వంలో బడులు తెరిచే ఆరు నెలల ముందే భారీ కసరత్తు చేసి, పాఠశాల ప్రారంభమైన మొదటి వారంలోనే విద్యార్థుల చేతికి పుస్తకాలు, యూనిఫాం, షూ, బ్యాగులు అందించాం. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి కేవలం ప్రచారాలకే పరిమితమైంది. బడ్జెట్లో అత్యధిక నిధులను ప్రచారానికే కేటాయించి, విద్యావ్యవస్థకు అన్ని హంగులు అద్దినట్లుగా రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ తల్లిదండ్రులను, పిల్లలను మభ్యపెడుతున్నారు. మహిళల భద్రత గురించి మాట్లాడే కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు కనీసం టాయిలెట్లు కూడా కల్పించడంలో విఫలమైంది. గత చంద్రబాబు హయాంలో (2014-19) సుమారు 1700 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, పెచ్చులూడిన స్లాబులు, నేలపై చదువులు, కనీసం బ్లాక్ బోర్డులు లేని దుస్థితిని కల్పించారు. మళ్లీ ఇప్పుడు అదే విధంగా పాఠశాలల్లో మూలపడిన ఫర్నీచర్, కింద కూర్చునే విద్యార్థులు, తాగునీటి కోసం బోర్ వెల్స్ వద్ద బారులు తీరే దారుణ పరిస్థితులను తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడం ద్వారా పేద విద్యార్థులను కార్పొరేట్ సంస్థలకు దాసోహం చేసే కుట్ర జరుగుతోంది. 2019లో వైఎస్. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. జూన్ 2019 నుండి ఫిబ్రవరి 2024 వరకు విద్యాశాఖపై రూ. 72,919 కోట్లు ఖర్చు చేశారు. 'నాడు-నేడు' ద్వారా రెండు దశల్లో 44,617 స్కూళ్లను సుమారు రూ. 11,000 కోట్లతో అత్యాధునికంగా తీర్చిదిద్దారు. పెయింటింగ్స్, ఫర్నీచర్, డిజిటల్ క్లాస్ రూములు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్ వంటి 11 రకాల మౌలిక వసతులను తప్పనిసరి చేశారు. 'అమ్మఒడి' పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 25,809 కోట్లు జమ చేశారు. ఇంగ్లీష్ మీడియం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ల పంపిణీ, బైలింగువల్ టెక్ట్స్ బుక్స్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలో ఇంగ్లిషులో ప్రసంగించే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు పెడుతున్న పేరెంట్ టీచర్ మీటింగ్స్ (పీటీఎం) సభల్లో కనిపిస్తున్న ఫర్నీచర్, టేబుల్స్ అన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వ హాయంలో సమకూర్చినవే. వైఎస్ జగన్ గారి హయాంలో రోజుకో మెనూతో, పౌష్టికాహారంతో రూ. 7,244 కోట్లు ఖర్చు చేసి 'జగనన్న గోరుముద్ద' అందిస్తే.. నేడు కూటమి ప్రభుత్వంలో అది పిల్లల ప్రాణాలకే ముప్పుగా మారింది. పాఠశాలల్లో నీళ్ల సాంబారు, ముద్దన్నం పెడుతున్నారు. కలుషిత నీరు తాగి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా చూస్తున్నాం. గతంలో 43 లక్షలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం 30 లక్షలకు పడిపోయిందని.. డ్రాపౌట్ రేట్ ఇంత దారుణంగా పెరగడానికి ప్రభుత్వ అసమర్థతే కారణం. స్టాన్ఫర్డ్లో చదువుకున్నానని చెప్పుకునే విద్యాశాఖ మంత్రి లోకేష్ రోజుకో దేశం తిరుగుతూ క్వాంటమ్ వ్యాలీ, ఏఐ టెక్నాలజీ అని మాట్లాడుతున్నారు, మరి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసురూములు, ట్యాబులు, నాడు-నేడు పనులను ఎందుకు ఆపేశారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అబ్బకూడదనేదే లోకేష్ ఉద్దేశమా? గతంలో లోకేష్ ఆర్భాటంగా ప్రకటించిన రూ. 7వేల కోట్ల 'మన బడి - మన భవిష్యత్తు' నిధులు ఏమయ్యాయి, ఆ పథకం కింద కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. వైఎస్ జగన్ హాయంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ విధానం ప్రవేశపెడితే దాన్ని తీసేసి, మళ్లీ ఏకోపాధ్యాయ పాఠశాలల (సింగిల్ టీచర్ స్కూల్స్) స్థాయికి విద్యావ్యవస్థను దిగజార్చాయని అన్నారు.
0 Comments