Ad Code

కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లడం అతిపెద్ద ‘రాజకీయ తప్పు’ అని దీదీ బహిరంగంగా ఒప్పుకోవాలి !

శ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 'జులై 21 అమరవీరుల దినోత్సవం' చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య సరికొత్త వివాదం రాజుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి బెంగాల్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శుభంకర్ సర్కార్ సంచలన సవాల్ విసిరారు. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం సొంత గూడైన కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లడం తాను చేసిన అతిపెద్ద ‘రాజకీయ తప్పు’ అని దీదీ బహిరంగంగా ఒప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కోల్‌కతాలోని షాహిద్ మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహించబోయే జులై 21 కార్యక్రమానికి వచ్చి అమరవీరులకు అంజలి ఘటించాలని ఆమెను ఆహ్వానించారు. షాహిద్ మినార్ వద్ద సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం శుభంకర్ సర్కార్ మీడియాతో మాట్లాడారు. 1993 జులై 21 నాటి చారిత్రాత్మక ఉద్యమం అప్పటి యూత్ కాంగ్రెస్ జెండా నీడలోనే జరిగిందని, ఆ పోరాట వారసత్వాన్ని తన వ్యక్తిగత ఖాతాలో వేసుకోవడానికి మమతా బెనర్జీ ప్రయత్నించకూడదని స్పష్టం చేశారు. “మమతా బెనర్జీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చరిత్రను మార్చే ప్రయత్నం చేయకూడదు. కాంగ్రెస్‌ను వీడి ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బహిరంగంగా అంగీకరిస్తూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మా వేదికపైకి వచ్చి అమరవీరులకు నివాళులర్పించడానికి ఆమెకు తలుపులు తెరిచే ఉన్నాయి” అని సర్కార్ వ్యాఖ్యానించారు. 1993 జులై 21న మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన యూత్ కాంగ్రెస్ ఆందోళనపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు. ఆ తర్వాత 1997 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ను వీడిన మమత, తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించి.. ప్రతి ఏటా జూలై 21న భారీ ఎత్తున అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహిస్తూ తన రాజకీయ బలాన్ని చాటుకుంటూ వచ్చారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారాన్ని కోల్పోవడంతో బెంగాల్ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె పార్టీ లోపల తీవ్ర అసమ్మతిని, బహుముఖ తిరుగుబాట్లను ఎదుర్కొంటోంది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబెల్ తృణమూల్ వర్గం.. ఎస్ప్లానేడ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద విడిగా అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. మరోవైపు, మమతా బెనర్జీ అధికారిక వర్గానికి విక్టోరియా హౌస్ వద్ద సభ జరుపుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ అనుమతుల వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల నడుమ, నాటి ఉద్యమం తమదేనంటూ కాంగ్రెస్ పార్టీ గట్టిగా గళం విప్పడం మమతా బెనర్జీకి మరింత ఇబ్బందికరంగా మారింది.

Post a Comment

0 Comments

Close Menu