Ad Code

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మల్లారెడ్డి : తిరుపతిలో డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా తెలంగాణలో అనేక పాఠశాలలు, వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలను స్థాపించినట్లు ఆయన తెలిపారు. తన విద్యాసంస్థల ద్వారా ప్రపంచ స్థాయి వైద్యులు, ఇంజనీర్లు, ఫార్మసిస్టులు తయారయ్యారని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలో ఒక విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని తనకు ఎప్పటి నుంచో కోరిక ఉండేదని ఆయన చెప్పారు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా ఆ పుణ్యక్షేత్రంలో కళాశాలను ఏర్పాటు చేసే అవకాశం కల్పించమని దేవుడిని ప్రార్థించినట్లు మల్లారెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత త్వరలోనే భూమిని సేకరించి, కళాశాల భవనాన్ని నిర్మించి, ప్రాంగణాన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్- రాయలసీమ విద్యార్థులకు మేలు చేకూర్చేలా, తెలంగాణకు చెందిన ఒక విద్యా సంస్థల సమూహం ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటం సంతోషకరమని మల్లారెడ్డి అన్నారు. ఈ సంస్థ రేణిగుంట సమీపంలో వుంటుందని మల్లారెడ్డి చెప్పారు. మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోద పత్రాన్ని జారీ చేసిందని కూడా ఆయన వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu