దేశంలోనే మొట్టమొదటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పర్యాటకులకు డిజిటల్ అనుభూతిని అందించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, 'ఎక్స్ప్లోరర్' సంస్థతో మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. 'స్వర్ణాంధ్ర విజన్-2047' లక్ష్య సాధనలో భాగంగా ఈ అధునాతన 'నివు ఏఐ' ప్లాట్ఫామ్ను రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెడుతున్నట్లు సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రకటించారు. మంగళగిరిలో విజయవంతంగా పూర్తయిన పైలట్ ప్రాజెక్ట్ ఆధారంగా రాష్ట్రంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో ఈ ఏఐ సేవలను అందుబాటులోకి తేనున్నారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన పర్యాటక కేంద్రాలలో ఈ వ్యవస్థను ప్రారంభించి, మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. పర్యాటకులు ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోనవసరం లేకుండా, కేవలం అక్కడ ఏర్పాటు చేసే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా చారిత్రక కట్టడాలు, కోటలు, బీచ్లు, గుహల గురించిన పూర్తి సమాచారాన్ని వాయిస్ లేదా టెక్స్ట్ రూపంలో ఉచితంగా పొందవచ్చు. ఈ ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 130కి పైగా భాషల్లో పర్యాటకులు సంభాషించవచ్చు. తమకు నచ్చిన భాషలోనే పర్యాటక ప్రాంతాల విశిష్టతలను తెలుసుకునే సదుపాయం ఉండటం వల్ల ప్రయాణం మరింత సులువుగా, ఆసక్తికరంగా మారుతుందని మంత్రి తెలిపారు. తాను స్వయంగా ఈ 'నివు ఏఐ' సేవలను తెలుగులో పరీక్షించానని, దీని స్పందన ఎంతో ఖచ్చితంగా, మర్యాదపూర్వకంగా ఉందన్నారు. ఇప్పటికే మంగళగిరిలో వందలాది మంది భక్తులు ప్రతిరోజూ ఈ సేవలను వినియోగించుకుంటూ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
0 Comments