ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బ్యూటీషియన్ నిషా చౌహాన్ పై భర్త ప్రదీప్ చౌహాన్ కత్తితో పలుమార్లు దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి అరుపులు విని ఆమెను రక్షించడానికి వచ్చిన కొడుకు కూడా ఈ దాడిలో గాయపడ్డాడు. భార్యను చంపిన తర్వాత, భర్త తనను తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రదీప్ తన భార్య నిషా, కొడుకుతో కలిసి మీరట్లో నివస్తున్నాడు. నిషా బ్యూటీ పార్లర్ నడుపుతూ, సోషల్ మీడియా కోసం వీడియోలు కూడా చేసేది. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయవద్దని ప్రదీప్ పదేపదే వారించినా, ఆమె వినలేదు. దీనివల్ల తరచుగా వారిద్దరి మధ్య వాగ్వాదాలు జరిగేవి. ఇటీవల ఈ దంపతుల మధ్య ఓ స్థలం ఎవరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలనే అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో ఇంట్లో ఉన్న కత్తిని తీసుకువచ్చి భార్య నిషాపై దాడి చేశాడు. తల్లి అరుపులు విని 17 ఏళ్ల కొడుకు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. తల్లిని కాపాడే ప్రయత్నంలో కొడుకు కూడా కత్తిపోటుకు గురయ్యాడు. కొడుకు కళ్లెదుటే తల్లి మరణించింది. భార్య నిషాను చంపిన తర్వాత, నిందితుడు ప్రదీప్ ఛాతీలో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. చుట్టుపక్కల వారు వెంటనే అప్రమత్తమై ప్రదీప్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత ప్రదీప్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని ఆధారాలు సేకరించింది. నిషా హత్య వెనుక పూర్తి కారణాలను వెలికితీసేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.
0 Comments