Ad Code

పోలవరం జిల్లాలో ఒకేరోజు 15 మలేరియా కేసులు నమోదు : అన్ని శాఖలు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్ లోని పోలవరంజిల్లాలో జూలై 2న 15 మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సంబంధిత అధికారులను శుక్రవారం ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత మండలాల ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీ అధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. మలేరియా శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని బాధితుల నివాసాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ప్రతి కేసుకు సంబంధించిన లైన్ లిస్టింగ్, ప్రభావిత ప్రాంతాల్లో మాస్ స్క్రీనింగ్, ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్, యాంటీ లార్వల్ ఆపరేషన్స్ వంటి నియంత్రణ చర్యలను ఎలాంటి అలసత్వం లేకుండా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి (డీఎల్‌పీఓ) అన్ని చర్యలను నిరంతరం పర్యవేక్షించి, చేపట్టిన కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని ఆదేశించారు. మలేరియా నివారణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమల నివారణ చర్యలు పాటించడం, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments

Close Menu