Ad Code

సంసారాన్ని బలిగొన్న బిర్యానీ వివాదం : భార్యాభర్తల ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో బిర్యానీ తెచ్చే విషయంలో ఫోన్‌లో జరిగిన చిన్నపాటి వాగ్వాదం ఒక నిండు సంసారాన్ని బలిగొంది. ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఇద్దరూ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం (33), ప్రియాంక (30) దంపతులు ఉపాధి నిమిత్తం విశాఖపట్నం వచ్చి, శ్రీనగర్ పరిసర ప్రాంతంలో నివసిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఘటన జరిగిన రోజు రాత్రి భర్త బలరాం మద్యం తాగడానికి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఆయన భార్య ప్రియాంకకు ఫోన్ చేసి, తనకు బిర్యానీ ఆర్డర్ చేసి లేదా తెచ్చి ఉంచాలని కోరాడు. ఈ క్రమంలో ఫోన్ లోనే ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరగడంతో ఇద్దరూ గొడవ పడ్డారు. భర్తతో ఫోన్ లో జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాసేపటి తర్వాత మద్యం మత్తులో ఇంటికి వచ్చిన బలరాం లోపల శవమై వేలాడుతున్న భార్య మృతదేహాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. భార్య మరణాన్ని తట్టుకోలేక, భయంతో ఏం చేయాలో తోచని స్థితిలో బలరాం కూడా అదే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే తన నాలుగేళ్ల చిన్నారి కొడుకు కళ్లెదుటే బలరాం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu