అమరావతిలో పొట్టి శ్రీరాములకు నివాళి అర్పించిన తరవాత జనసేనాని పవన్ కల్యాణ్ భావోద్వేగంతో మాట్లాడారు. తెలంగాణ మా జాగీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలపై పవన్ స్పందించారు. కేటీఆర్ ..తెలంగాణ భూమిపుత్రుల జాగీరు అన్నారు. పవన్ కాదని ఎవరన్నారని ప్రశ్నించారు. హక్కులు ఉన్నంత మాత్రాన తనను అడుగుపెట్టనివ్వను అనడం సరికాదని, ప్రజా గాయకుడు గద్దర్ కూడా ఎప్పుడూ ఇలాంటి సంకుచిత భాష మాట్లాడలేదని ఆయన గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది నిరుద్యోగులు ఉంటే, వారి అభివృద్ధిని పట్టించుకోకుండా కొందరు నేతలు కుల దూషణలకు, ప్రాంతీయ విద్వేషాలకు దిగుతున్నారని, మనసుల్లో వేసే విభజన రేఖలకు చరమాంకం పలకాలని తాము నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. కేటీఆర్తో తనకు ఉన్నది బ్రదర్లీ రిలేషన్ షిప్ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మా ఇద్దరికీ పరస్పర గౌరవం, ఇష్టాలు ఉన్నాయని, తన సభపై కేటీఆర్ తప్పుగా మాట్లాడి ఉండరని అన్నారు. ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వమంటున్న కాంగ్రెస్ నేతలపై పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ 2014 నుంచి ఇప్పటిదాకా ఏపీకి చెందిన ఎంతమంది తెలంగాణలో కాంట్రాక్టులు తీసుకున్నారో లెక్కలు తీయండి అని నిలదీశారు. ప్రజల మధ్య లేనిపోని ద్వేషం తీసుకురావద్దని హితవు పలికారు. తెలంగాణలో జనసేన తరఫున ఆంధ్రా నాయకులు వచ్చి పోటీ చేయరని, ఇక్కడి స్థానిక నాయకులే పోటీ చేస్తారని, అలాంటప్పుడు వారు సభ పెట్టుకుంటే ఆపేందుకు వీరెవరని ప్రశ్నించారు. గతంలో సభలను, నాయకులను అడ్డుకున్న వారి గతి ఏమైందో అందరూ చూశారని పవన్ కల్యాణ్ పరోక్షంగా బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలను ఉద్దేశించి హెచ్చరించారు. ఏపీలో నాడు సభలు పెట్టనియ్యకపోతేనే కదా వైసీపీ 11 సీట్లకు పడిపోయిందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ ' అంశంపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు అన్నారు. అది కాస్తా ఇప్పుడు మూడు జిల్లాలు అయిపోయింది అంటూ ఎగతాళి చేశారు. తెలంగాణ, తమిళనాడు ప్రజల్లో ఉన్న బలమైన ప్రాంతీయ అస్తిత్వ భావనను అభినందించిన పవన్, ఏపీ వాళ్లలో మాత్రం ఇంకా సబ్-రీజియన్స్ ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. ఆంధ్ర అనే ఒకే ఒక్క భావన అందరిలో ఉంటే మంచిదని హితవు పలికారు.
0 Comments