Ad Code

నైరుతి రుతుపవనాల రాకతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు : రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ


జూన్ 4న కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రస్తుత సీజన్‌లోనే మొదటిసారిగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కేరళలోని ఐదు జిల్లాల్లో ముంచెత్తే వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం ఉదయం కోజికోడ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో బలమైన ఈదురు గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శనివారం మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గడ్ జిల్లాల్లో కేవలం 24 గంటల్లోనే 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆదివారం కూడా కొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పేర్కొంది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గడ్ లకు రెడ్ అలర్ట్, ఇడుక్కి, త్రిస్సూర్, ఎర్నాకుళం, కొట్టాయం, పాలక్కాడ్, పతనంతిట్టలకు ఆరెంజ్ అలర్ట్, అలప్పుజ, కొల్లం, తిరువనంతపురంలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వ సహాయక శిబిరాలకు తరలివెళ్లాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. అత్యవసర సాయం కోసం ప్రజలు 1077, 1070 నంబర్లను సంప్రదించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu